NTV Telugu Site icon

IND vs AUS: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌ స్కోర్ 51/4! వర్షం పడకుంటే మరిన్ని ఢమాల్

Kl Rahul

Kl Rahul

బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (33), కెప్టెన్ రోహిత్‌ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ 2 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్‌, ప్యాట్ కమిన్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. వర్షం అంతరాయం కలిగించకుంటే భారత్ మరిన్ని వికెట్లను చేజార్చుకునేదని ఫ్యాన్స్ అంటున్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌ నైట్ 405/7 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ మరో 40 పరుగులు జోడించి మూడు వికెట్స్ కోపోయింది. వికెట్ కీపర్ అలెక్స్‌ కేరీ (70) హాఫ్ సెంచరీ బాదాడు. రెండో రోజు ఆటలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్స్ తీశాడు. మహమ్మద్ సిరాజ్‌ 2, నితీశ్‌ రెడ్డి 1, ఆకాశ్ దీప్‌ 1 వికెట్‌ పడగొట్టారు.

Also Read: Bangladesh Elections: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై మహమ్మద్‌ యూనస్‌ కీలక ప్రకటన!

భారత్ తొలి ఇన్నింగ్స్‌ను బౌండరీతో ప్రారంభించింది. యశస్వి జైస్వాల్‌ (4) మొదటి బంతినే ఫోర్‌ కొట్టి.. రెండో బంతికి అవుట్ అయ్యాడు మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లోనే షార్ట్‌ మిడాఫ్‌లో మిచెల్ మార్ష్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. కాసేపటికే శుభ్‌మన్‌ గిల్ (1) ఆఫ్‌సైడ్ షాట్‌కు యత్నించి స్లిప్‌లో మార్ష్‌కు దొరికిపోయాడు. విరాట్ కోహ్లీ (3) మరోసారి ఆఫ్‌ సైడ్‌ పడిన బంతిని ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో రెండుసార్లు వర్షం పడడంతో మ్యాచ్‌ సజావుగా సాగలేదు. ఆట ప్రారంభమైన కాసేపటికే రిషబ్ పంత్ (9)ను కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. వికెట్స్ పడుతున్నా కేఎల్‌ రాహుల్‌ క్రీజులో నిలబడి పరుగులు చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరుకు భారత్‌ ఇప్పటికే బాగా వెనకబడి ఉంది. క్రీజ్‌లో ఉన్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజాపైనే భారం ఉంది. ఫాలోఆన్‌ గండం నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 195 రన్స్‌ (మొత్తంగా 246 పరుగులు) చేయాలి.