IMD Heatwave Alert: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. సూర్యుడు మండే అగ్ని గోళంగా మారిపోయాడు. వేడి మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజుల పాటు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏపీ, తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. మరో మూడు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మ. 12 గంటల నుంచి మ.3 గంటల వరకు అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. ఇక ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి..
ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు, కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లు ఉపయోగించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. ఇవి చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు చేస్తాయి. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 లోపు ఎండలో తిరగకపోవటమే మంచిది. ఒకవేళ అత్యవసర పనిపై బయటకు వెళ్తే.. గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇంట్లో ఉన్నా.. తరచూ నీరు తాగాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభించి వడదెబ్బ బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 4 లీటర్లు నీరు తాగాలి. ఎండలో పని చేసేవారు మరో లీటరు అదనంగా తీసుకోవాలి. వేసవిలో కలుషిత నీళ్ల ముప్పు అధికం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదు. బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి నీళ్ల బాటిల్ తీసుకెళ్లటం ఉత్తమమైన పని. తాజాగా వండిన ఆహారం తీసుకోవడంతో పాటు బయట తినడం మానుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
