Site icon NTV Telugu

Ilaiyaraaja: ఇళయరాజా ఖాతాలో.. మరో ప్రతిష్టాత్మక అవార్డు!

Ilaiyaraaja

Ilaiyaraaja

భారతీయ సంగీత ప్రపంచంలోనే.. తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను, మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. మహారాష్ట్రలో జరగనున్న, అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) నిర్వాహకులు, ఈ ఏడాది ‘పద్మపాణి’ పురస్కారాన్ని ఇళయరాజాకు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాలుగా వేల సంఖ్యలో అద్భుతమైన పాటలను అందించి, కోట్లాది మంది సంగీత ప్రియులకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరగనున్న ఈ చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో భాగంగా, దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో ఇళయరాజా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కాగా ఈ గౌరవం ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో మరొక కలికితురాయిగా నిలవనుంది.

Also Read : Dimple Hayathi: డేవిడ్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన డింపుల్.. అసలేమైందంటే?

పద్మపాణి పురస్కారం‌లో భాగంగా ఇళయరాజాకు ఒక జ్ఞాపికతో పాటు గౌరవ పత్రం.. అలాగే రూ. 2 లక్షల నగదు బహుమతి‌ని ప్రదానం చేయనున్నారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారతీయ చిత్రపరిశ్రమ‌కు చెందిన ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్, విలక్షణ నటుడు ఓం పురి, ప్రఖ్యాత దర్శక-రచయిత్రి సాయి పరంజ్‌పే వంటి దిగ్గజాలు అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇళయరాజా పేరు చేరడం పట్ల ఆయన అభిమానులు, సంగీత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాటలకే కాకుండా, నేపథ్య సంగీతం‌లో వినూత్న ప్రయోగాలు చేస్తూ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి‌కి, ఈ పురస్కారం దక్కడం సముచితమని ఇండస్ట్రీ వర్గాలు కొనియాడుతున్నాయి. ఇక ఈ వేడుక కోసం అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version