భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 37 ఖాళీలను ప్రకటించగా.. అందులో 33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 4 మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
ఈ నియామకాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 18, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకుని.. అవసరమైన వివరాలను నమోదు చేసి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:Oppo A6s 5G: భారత్లో Oppo A6s 5G లాంచ్.. 6,500mAh బ్యాటరీ, Dimensity 6300, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
ఎంపిక ప్రక్రియను పలు దశలుగా నిర్వహిస్తారు. మొదట స్క్రీనింగ్ జరుగుతుంది. అనంతరం రాత పరీక్ష, టెక్నికల్ లేదా బిహేవియరల్ అప్రైజల్, చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని అన్ని కోణాల్లో అంచనా వేసి తుది ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్తో పాటు సంబంధిత విభాగానికి చెందిన డొమైన్ నాలెడ్జ్పై ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది.
జీతభత్యాల విషయానికి వస్తే.. మేనేజర్ (Grade B) పోస్టులకు ప్రారంభ వేతనం సుమారు రూ.55,200గా ఉండగా.. వార్షిక CTC సుమారు రూ.23.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థ కావడంతో ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించే కీలక సంస్థగా IIFCL దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాంటి సంస్థలో ఉద్యోగం సాధించడం యువతకు మంచి అవకాశంగా భావించవచ్చు.
అయితే.. ఖాళీలు తక్కువగా ఉండటం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలాగే అర్హతలు, అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
