భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్ఫోన్ ధరలు సామాన్య ప్రజలతో పాటు మొబైల్ తయారీ కంపెనీలకూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. ఆపిల్, షావోమి, ఒప్పో, వివో వంటి దిగ్గజ గ్లోబల్, దేశీయ కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంఘం.. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని ఏకంగా 5 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్లను కోరింది. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా కేంద్రాల కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో, మొబైల్స్లో వాడే డ్రామ్, నాండ్ ఫ్లాష్ మెమరీ చిప్స్ ధరలు సెప్టెంబర్ 2025 తర్వాత దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారాన్ని పూర్తిగా భరించలేక కంపెనీలు ధరలను పెంచడంతో, గత ఏడాది కాలంలో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ఫోన్ల ధరలు 35 నుంచి 45 శాతం వరకు ఎగిశాయి. ఫలితంగా రూ. 10,000 కంటే తక్కువ ధర ఉండే బడ్జెట్ ఫోన్ల లభ్యత మార్కెట్లో 5 శాతానికి పడిపోయింది.
జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తే ఫోన్ల ప్రారంభ ధరలు గణనీయంగా తగ్గుతాయని ICEA భావిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలు, తక్కువ ఆదాయ వర్గాలు, తొలిసారి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేవారికి ఎంతో ఊరటనిస్తుంది. దీనివల్ల ఫీచర్ ఫోన్లు, 2జీ వాడేవారు స్మార్ట్ఫోన్ల వైపు మళ్లే వేగం పుంజుకుంటుంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను ఉండగా, 2020 ఏప్రిల్లో దానిని 18 శాతానికి పెంచారు.
భారత్లో మొబైల్ తయారీ రంగం అద్భుతంగా వృద్ధి చెందింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,900 కోట్లుగా ఉన్న ఉత్పత్తి, 2025-26 నాటికి రూ. 6.27 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు కూడా రూ. 1,566 కోట్ల నుంచి రూ. 2.60 లక్షల కోట్లకు పెరిగాయి. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా నిలిచింది. అయితే ఉత్పత్తి , ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం డిమాండ్ మందగించింది. పన్ను తగ్గింపు ద్వారా విక్రయాలు ఊపందుకుంటాయని, డిజిటల్ సేవలు విస్తరిస్తాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

