ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..

Icc Board Meeting

Icc Board Meeting

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా క్రికెట్ కెనడాపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు గానూ ‘క్రికెట్ కెనడా’ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే రద్దు చేసింది. అయితే, బోర్డు తప్పుల వల్ల ఆటగాళ్లు నష్టపోకూడదని ఐసీసీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కెనడా జాతీయ జట్లు ఐసీసీ టోర్నమెంట్లలో ఆడటానికి అనుమతి ఇచ్చింది. అలాగే వారికి అందాల్సిన నిధులను ఐసీసీ తన పర్యవేక్షణలోనే నేరుగా అందిస్తుంది. కెనడా బోర్డు తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఐసీసీ కొన్ని నిబంధనలను విధించింది.

టెస్ట్ మ్యాచ్‌ల్లో ‘పింక్ బాల్’ ప్రయోగం
సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఆటను నిలిపివేస్తారు. దీనివల్ల సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లు అంగీకరిస్తే, వెలుతురు తగ్గినప్పుడు సాంప్రదాయ రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ను ఉపయోగించే కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అలాగే స్టేడియంలలో లైటింగ్ టెక్నాలజీని మెరుగుపరచడంపై కూడా ఐసీసీ పరిశోధనలు చేస్తోంది.

×
×
Ad

టీ20 వరల్డ్ కప్ కోసం ‘గ్లోబల్ క్వాలిఫైయర్’
చిన్న దేశాలకు (అసోసియేట్ దేశాలకు) మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం ‘గ్లోబల్ క్వాలిఫైయర్’ టోర్నమెంట్‌ను మళ్లీ తీసుకురానుంది. ఇందులో 16 జట్లు పోటీ పడతాయి. చిన్న దేశాల మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త రూల్స్ ఇవే..
లెగ్-సైడ్ వైడ్స్: బ్యాటర్ బంతి వేసే సమయంలో ఎక్కడ నిలబడ్డాడనే దాన్ని బట్టి వైడ్ ఇవ్వాలా వద్దా అనే నిబంధనను ఐసీసీ శాశ్వతంగా అమలు చేస్తోంది.

బౌలింగ్ యాక్షన్ తనిఖీ: బౌలర్ల బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వస్తే అంపైర్లు ఇకపై ‘హాక్-ఐ’ టెక్నాలజీ డేటాను ఉపయోగించవచ్చు.

డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్‌లతో టాక్: మ్యాచ్ మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్‌లలో హెడ్ కోచ్‌లు లేదా వారి ప్రతినిధులు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడవచ్చు.

టీ20 ఇంటర్నేషనల్స్: ఇకపై అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ మధ్యలో తప్పనిసరిగా 15 నిమిషాల విరామం ఉంటుంది.

మహిళల క్రికెట్‌లో మార్పులు..
2027 లో జరగాల్సిన ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని జూన్-జూలై నుండి 2027 ఫిబ్రవరి 14-28 కి మార్చారు. 2026 లో 10 జట్లతో (5 పూర్తి స్థాయి దేశాలు, 5 చిన్న దేశాలు) ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ని ప్రారంభించనున్నారు. 2028 మహిళల టీ20 వరల్డ్ కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఆడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతాయి.

ఫ్రాంచైజీ లీగ్‌లపై నిఘా..
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్‌లు (ఫ్రాంచైజీ క్రికెట్) ఎక్కువైపోతుండటంపై ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఇబ్బంది కలగకుండా ఈ లీగ్‌లను ఎలా సర్దుబాటు చేయాలో చూడటానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించడానికి ప్రత్యేక ప్రతినిధులను పంపాలని నిర్ణయించారు. ‘ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా , అభిమానులకు మరింత వినోదాత్మకంగా మార్చడమే మా లక్ష్యం’ అని ఐసీసీ ఛైర్మన్ జే షా తెలిపారు.