HYDRA Commissioner: మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం

  • మణికొండ, మంచిరేవులలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటన
  • మార్నింగ్‌ రాగా గేటెడ్‌ కమ్యూనిటీని సందర్శన
  • రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించడంపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు
  • ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌
Hydra Commissioner

Hydra Commissioner

HYDRA Commissioner: హైదరాబాద్‌లోని మణికొండ, మంచిరేవులలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో నిర్మించిన మార్నింగ్‌ రాగా గేటెడ్‌ కమ్యూనిటీని ఆయన సందర్శించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించడంపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Bandi Sanjay: రేవంత్ రెడ్డి.. నిన్ను విడిచే పెట్టే పరిస్థితి లేదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

గ్రౌండ్ ఫ్లోర్‌ను కమర్షియల్‌గా మార్చితే నిర్మాణ సామర్థ్యం సరిపోదని హైడ్రా కమిషనర్ సూచించారు. అనుమతుల మేరకే భవన వినియోగం ఉండాలని నిర్వహణ దారులకు సూచించారు. అనూహర్ హోమ్స్ అనుమతుల పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంచిరేవుల దగ్గర మూసీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదిత్య, ఎన్‌సీసీ, రాజ్ పుష్ప నిర్మాణ సంస్థలను ఆదేశించారు. రంగనాథ్ ఆదేశాలతో మట్టిని తొలగించేందుకు ఆయా నిర్మాణ సంస్థలు అంగీకరించారు.