Hyderabad: హైదరాబాద్లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఘటనలో 5 గురు మృతి చెందారు. నిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. 22 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.. దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది. మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గుర్తించిన అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతదేహాలను గుర్తించి మార్చురీకి తరలించారు.
READ MORE: Hyderabad: పంజాగుట్ట కాలేజీలో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు..
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్లోని హోల్సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో పలువురు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానిక యువకులు సాహసించి భవనంలోకి వెళ్లి కొంత మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భవనంలోని మిగిలిన కుటుంబాలను, పక్కనే ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. కాగా.. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు మంది మృతి చెందారు.