Hyderabad: మియాపూర్‌లో విషాదం..! ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.!

Hyd

Hyd

Hyderabad: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో తెరిచి ఉంచిన మాన్‌హోల్‌లో పడి ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్య (70)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అలాగే హైడ్రా (HYDRAA), ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు కూడా రంగంలోకి దిగి గల్లంతైన వృద్ధుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాన్‌హోల్‌ను తగిన భద్రతా ఏర్పాట్లు లేకుండా తెరిచి ఉంచినట్లు తెలుస్తోంది. అటుగా వెళ్తున్న బాలయ్య ప్రమాదవశాత్తు డ్రైనేజీ నాలాలో పడిపోయి గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలయ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ.. సంబంధిత సివిక్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం గల్లంతైన బాలయ్య కోసం హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతర గాలింపు కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నారు.