CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. మెట్రో ఫేజ్‌–2 అనుమతుల కోసం ఢిల్లీకి బయల్దేరారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి కలుసుకుంటారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2కు త్వరగా ఆమోదం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఫేజ్‌–2లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయి. ఫేజ్‌–2లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1 నెట్‌వర్క్‌ 69.2 కిలోమీటర్లు, ఫేజ్‌–2 పూర్తయితే హైదరాబాద్‌ మెట్రో మొత్తం నెట్‌వర్క్‌ 191.9 కిలోమీటర్లకు పెరుగుతుంది. హైదరాబాద్‌ నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్‌, ఎయిర్‌పోర్ట్‌ కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫేజ్‌–2 విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది.

ఇదిలా ఉండగా.. మెట్రోరైలు రెండో దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్‌లో వందశాతం షేర్ల కొనుగోలుతో ప్రాజెక్ట్‌ను గత నెల 30న ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలుపుతూ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు.. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోవడంతో ఇప్పటివరకు కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు తొలగిపోయాయని తెలిపారు. ఇకనైనా రెండోదశ ఎ, బి భాగంలోని ఏడు మార్గాల సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లను ఆమోదించాలని లేఖలో కోరారు.