Hyderabad Hit-and-Run: హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 3 ఏళ్ల పసి బాలుడు ఇజాన్ ఉద్దీన్ తన తండ్రి మొహిదుద్దీన్ సాహెబ్తో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకురావడానికి వెళ్లగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు బాలుడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పసి బాలుడు ఇజాన్ ఉద్దీన్ను వెంటనే షాలిని ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు. కారు నడిపింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. ప్రస్తుతం కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనలో మూడేళ్ళ చిన్నారి ఇజాన్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడారు. “డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి చాలా స్పీడ్గా, ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. దాదాపు 15 ఫీట్ల వరకు మూడేళ్ల బాబుని ఈడ్చుకొని వెళ్ళాడు. పోలీసులు కారు నడిపింది ఎవరంటే పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడం లేదు. మాకు న్యాయం జరగాలి. ఇంత టెక్నాలజీ ఉందని చెబుతున్నారు, కాని ఇప్పటివరకు కారు నడిపింది ఎవరనేది పోలీసులు గుర్తించలేదు. ఇంకా ఎంతమంది ఇలాంటి ఘటనలతో ప్రాణాలు కోల్పోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్షలు అమలు చేయాలి.” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

