Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల మొద్దు నిద్ర.. నగరంలో భారీగా కుళ్లిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ హలీం, అల్లం-వెల్లుల్లి పేస్ట్!

Hyderabad Food Adulteration

Hyderabad Food Adulteration

Hyderabad: హైదరాబాద్ ఫుడ్‌కు ఫేమస్. ఇక్కడికి వచ్చే టూరిస్టులు నగరంలోని ప్రముఖ ప్రదేశాలను వీక్షిస్తూ.. బిర్యానీతో సహా అనేక రకాల ఐటెమ్‌లు టేస్ట్ చేస్తూ ఉంటారు. మంచి రివ్యూస్ ఇస్తుంటారు. ఇది ఒకవైపు మాత్రమే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కల్తీ భయం వెంటాడుతోంది. తినే పదార్థం ఏది ముట్టుకోవాలన్నా ప్రజలు భయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లతో అధికారులు కుమ్మక్కై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రంజాన్ సీజన్‌లో భారీగా హలీం తయారీ జరుగుతున్నప్పటికీ, ఆ కేంద్రాలపై సరైన తనిఖీలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాడుతున్న మాంసం నాణ్యత, పదార్థాల స్వచ్ఛత, తయారీ పరిస్థితులపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిచెన్లలో పరిశుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సైలెంట్ అయిపోయిన సమయంలో, పోలీస్ శాఖ మాత్రం కల్తీ ఆహారం దందాపై గట్టి చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి వరుసగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.

READ MORE: Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

మైలార్‌దేవ్‌పల్లి: నాసిరకం పదార్థాలతో కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న యూనిట్‌పై దాడి చేసి కేసు నమోదు చేశారు.
అంబర్‌పేట: హానికర కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న 250 కిలోల కల్తీ పెరుగును సీజ్ చేశారు.
మంగళహాట్: ఇక్కడ కుళ్లిపోయిన 300 కిలోల మటన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, ఢిల్లీ, కశ్మీర్ నుంచి మేక తలకాయలు, లివర్, బోటి వంటి భాగాలను ఇంపోర్ట్ చేసుకొని, ఫ్రీజ్ చేసి స్థానిక బార్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.

ఖైరతాబాద్ జోన్: హైదరాబాద్‌ కమీషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) పరిధిలోని ఒక ప్రాంగణంలో కల్తీ అల్లవెల్లుల్లి పేస్ట్ బయటపడింది. టప్పాచబుత్ర (Tappachabutra)లో నివసిస్తున్న, సహారా ఇండియా యజమాని, వ్యాపారవేత్త అయిన మహమ్మద్ జాఫర్ ఆలం (42) ఈ దందా ప్రారంభించాడు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను సిట్రిక్ యాసిడ్, ఉప్పు వంటి పదార్థాలను కలిపి, ఆ పేస్ట్‌ను దుమ్ము, ఈగలు, ఇతర కాలుష్య కారకాలకు గురయ్యేలా తెరిచి ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తున్నాడు. దీనివల్ల ఆ పేస్ట్ మానవ వినియోగానికి అనర్హంగా మారింది.

మంగళహాట్‌లో అక్రమంగా మాంసం విక్రయిస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు నామమాత్రపు ఫైన్ వేసి వదిలేయడంతో, అతను మళ్లీ ఇదే కల్తీ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో మటన్ చాలా అన్-హైజీనిక్ గా, పబ్లిక్ హెల్త్ కు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక పోలీసుల ఆపరేషన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొనకపోవడం, విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ ఆహారం దందాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.