Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్‌పై కేసు నమోదు..

Hyderabad Cyber Crime

Hyderabad Cyber Crime

Hyderabad: భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం మెటాకు మరోసారి నోటీసులు జారీ చేయగా, తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు సోషల్ మీడియా యూజర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ వీడియోను AI (కృత్రిమ మేధ) సాంకేతికతతో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సీజేపీ నిరసన సమయంలో ప్రధాని మోడీ షేర్ చేసిన వీడియోను కొందరు AI సహాయంతో ఎడిట్ చేసి, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు తెలిపారు. మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ మార్ఫింగ్ వీడియోలు వైరల్ అయినట్లు విచారణలో తేలింది.

ఈ విజువల్స్ ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, నూతన భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT Act) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోలను ఎవరు సృష్టించారు? సోషల్ మీడియాలో ఇవి అంత విస్తృతంగా ఎలా వ్యాపించాయి? ప్లాట్‌ఫామ్స్ వద్ద ఉన్న భద్రతా చర్యలు వీటిని అడ్డుకోవడంలో సరిపోలేదా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. వీటిని రూపొందించి, షేర్ చేసిన ప్రతి ఒక్కరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ప్రతినిధులను పిలిపించి, ప్లాట్‌ఫామ్‌లలో AI స్కామ్‌లు, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్ కంటెంట్‌ను గుర్తించి తొలగించే ప్రక్రియపై వివరణ కోరారు. దీనిపై స్పందించిన మెటా ప్రతినిధులు అధికారుల ముందు హాజరై, తమ వద్ద ఉన్న కంటెంట్ మోడరేషన్ విధానాలు, నిబంధనల వివరాలను సమర్పించారు. ప్రస్తుతం ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. డిజిటల్ ఆధారాల ప్రకారమే అన్ని ఆరోపణలను పరిశీలిస్తామని, ప్రస్తుతం ఎవరిపై నేరం రుజువు కాలేదని, దర్యాప్తు ఫలితాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.