Human Rights Forum: నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రియాజ్ ఎన్కౌంటర్పై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన చేసింది. “ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి, చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను కోరుతున్నాం.. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్య నేరం మోపాలి. రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి.” అని మానవ హక్కుల వేదిక తెలంగాణ పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE: Leopard In Village: జనారన్యంలోకి ప్రవేశించిన చిరుతపులి.. చితకొట్టిన జనం
కాగా.. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై సీపీ సాయి చైతన్య కీలక విషయాలు వెల్లడించారు. రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడని తెలిపారు. చెకింగ్ లో భాగంగా ఆర్ ఐ గది వద్దకు వెళ్ళగానే శబ్దం వినిపించటంతో రూమ్ లోకి వెళ్ళాడని చెప్పారు. ఈ సమయంలో రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకి లాక్కున్నాడని అన్నారు. ఆ తర్వాత రియాజ్ ట్రిగ్గర్ లాగే ప్రయత్నం చేసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు తెగబడ్డాడని వెల్లడించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా గత్యంతరం లేక ఆర్ ఐ రియాజ్ పై కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.