Pesara Payasam: తీపి తినాలనిపించినప్పుడు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే వంటకం కోసం చూస్తుంటే ‘పెసరపప్పు పాయసం’ బెస్ట్ ఛాయస్ గా నిలుస్తుంది. పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, పాలు వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలతో తయారయ్యే ఈ పాయసం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఈ పాయసాన్ని సులభంగా తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
కావాల్సిన పదార్థాలు:
* పెసరపప్పు – 2 కప్పులు
* బెల్లం – తగినంత
* నీరు – అవసరమైనంత
* పాలు – కొద్దిగా (కాచినవి)
* తాజా కొబ్బరి తురుము – 1 కప్పు
* జీడిపప్పు – కొద్దిగా
* కిస్మిస్ (ఎండు ద్రాక్ష) – కొద్దిగా
* యాలకుల పొడి – 1 టీ స్పూన్
* నెయ్యి – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక గంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం నానబెట్టిన పప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి పప్పు పూర్తిగా మునిగేలా నీరు పోసి మీడియం మంటపై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పెట్టుకోవాలి.
అదే పాన్లో కిస్మిస్ వేసి పొంగే వరకు వేయించి పక్కన పెట్టాలి. తరువాత మరికొద్దిగా నెయ్యి వేసి తాజా కొబ్బరి తురుమును ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించుకోవాలి. మరో పాత్రలో బెల్లంను కొద్దిగా నీరు వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన పెసరపప్పును వేసి మీడియం మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత కాచిన పాలను జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్ మరియు కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు మరిగించిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే హెల్తి ‘పెసరపప్పు పాయసం’ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేస్తే ఈ పెసరపప్పు పాయసం అద్భుతమైన రుచిని అందిస్తుంది. బెల్లం తీపి, కొబ్బరి సువాసన, నెయ్యి రుచి కలగలిసి ప్రతి ముద్దను మరింత ప్రత్యేకంగా ఆస్వాదించవచ్చు .

