HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు

  • మరోసారి వివాదాల్లో హెచ్‌సీఏ
  • కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదని టీసీఏ ఆరోపణ
  • బీసీసీఐ, సీఐడీకి టీసీఏ అధికారిక ఫిర్యాదు
  • డబుల్ రిజిస్ట్రేషన్ క్లబ్ కొనుగోలు చేసి హెచ్‌సీఏలోకి వచ్చారని ఆరోపణలు
  • “ఆక్స్‌ఫర్డ్ బ్లూస్” క్లబ్ రీ-రిజిస్ట్రేషన్‌పై వివాదం..
Hca Controversy

Hca Controversy

HCA Controversy: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), సీఐడీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి వెల్లడించారు.

జీవన్ రెడ్డి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్‌ను కొనుగోలు చేసి హెచ్‌సీఏలోకి ప్రవేశించారని గురువా రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన “ఆక్స్‌ఫర్డ్ బ్లూస్” అనే క్లబ్‌ను గతంలో వెంకటేశ్వరావు నిర్వహించారని, అయితే గతేడాది అదే క్లబ్‌ను మళ్లీ రీ-రిజిస్టర్ చేసి జీవన్ రెడ్డి కార్యదర్శిగా మారారని తెలిపారు. ఒక జిల్లాలో ఇప్పటికే రిజిస్టర్ అయిన క్లబ్‌ను మరో జిల్లాలో మళ్లీ రిజిస్టర్ చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఇలాంటి తప్పిదమే గతంలో జగన్ మోహన్ రావు చేసినట్లు గుర్తుచేసిన గురువా రెడ్డి.. ప్రస్తుతం జీవన్ రెడ్డి కూడా అదే విధానాన్ని అనుసరించారని ఆరోపించారు. సభ్యులు, ఓటర్ల మార్పులు జనరల్ బాడీ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉండగా అలాంటి ప్రక్రియ జరగలేదని అన్నారు. క్లబ్ కొనుగోలు చేసిన మూడు నెలల్లోనే జీవన్ రెడ్డి హెచ్‌సీఏ కార్యదర్శిగా ఎన్నిక కావడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.

హెచ్‌సీఏలో 2004 నుంచి అనేక అక్రమాలు, మార్పులు జరుగుతున్నాయని టీసీఏ ఆరోపించింది. గతంలో జగన్ మోహన్ రావుతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఖాళీలను భర్తీ చేసేందుకు పలు కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. ఎలాంటి అనుభవం లేని ఇంతియాజ్‌ను సీఈఓగా నియమించారని, అమర్నాథ్‌ను అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జీవన్ రెడ్డికి మద్దతు ఇచ్చామని హెచ్‌సీఏ పెద్దలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని గురువా రెడ్డి అన్నారు. ఈ అంశంపై కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జోక్యం క్రికెట్ పరిపాలనలో ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక టీజీ20 లీగ్‌పైనా టీసీఏ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ లీగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ క్రికెటర్ అంబటి రాయుడును ఆపరేషన్ హెడ్‌గా నియమించారని, అలాగే ఈవెంట్ మేనేజర్ నిరంజన్‌ను అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో చేర్చారని తెలిపారు. అయితే మాజీ క్రికెటర్లు నియోల్ డేవిడ్, వెంకటపతి రాజు వంటి అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వకపోవడం ప్రశ్నార్థకమని పేర్కొన్నారు.

టీజీ20 లీగ్‌లో వయోపరిమితిని 16 నుంచి 36 సంవత్సరాల వరకు నిర్ణయించడం ఎక్కడా చూడలేదని టీసీఏ విమర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లకు ఒక్క రోజులోనే సెలక్షన్ నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. మొత్తం వ్యవహారంపై జీవన్ రెడ్డి ఎన్నికను వెంటనే రద్దు చేసి, హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.