Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!

Hassan Eisakhil

Hassan Eisakhil

Hassan Eisakhil: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కుమారుడు హాసన్ ఈసాఖిల్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. 19 ఏళ్లున్న హాసన్.. ఆఫ్ఘనిస్థాన్-11, ఉజ్బెకిస్థాన్ మధ్య జరిగిన ఏకైక అనధికారిక టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన హాసన్ ఈసాఖిల్ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు, అద్భుతమైన ఫోర్లతో చెలరేగిపోయిన హాసన్ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు, 16 భారీ సిక్సర్లు, 352.94 స్ట్రైక్‌రేట్ తో 120 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ మధ్యలో అసౌకర్యం కారణంగా హసన్ రిటైర్డ్ అవుట్ గా మైదానం వీడాల్సి వచ్చింది.

హసన్ ఈసాఖిల్, కెప్టెన్ ఇమ్రాన్ మీర్ కలిసి తొలి వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇమ్రాన్ మీర్ కూడా 74 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్-11 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 323 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. గత కొద్దికాలంగా హసన్ ఈసాఖిల్ తన అద్భుత ప్రదర్శనతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో తన తండ్రి మహ్మద్ నబీతో కలిసి కూడా ఆడుతున్న హాసన్, ఇప్పటికే పలు లీగ్‌ల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

ఇప్పటివరకు హసన్ 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-A మ్యాచ్‌లు, 38 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేసిన అతడు ఇటీవల భారత్, శ్రీలంకలతో జరిగిన ట్రై సిరీస్‌లో పాల్గొన్న ఆఫ్ఘనిస్థాన్-A జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ నబీ తన కుమారుడితో కలిసి ఆఫ్ఘనిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఎన్నోసార్లు తన కోరికను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం హసన్ ప్రదర్శన చూస్తుంటే ఆ కల త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.