డబ్ల్యూపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి బ్రబోర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భార్తీ ఫుల్మాలీ (61; 25 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. హర్లీన్ డియోల్ (24), లిచ్ఫీల్డ్ (22) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు హేలీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్కు ముందే ముంబై, గుజరాత్ టీమ్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (54; 33 బంతుల్లో 9×4) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నాట్సీవర్ (38; 31 బంతుల్లో 6×4), అమన్జ్యోత్ కౌర్ (27; 15 బంతుల్లో 3×4, 1×6)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (27; 22 బంతుల్లో 3×4, 2×6) కూడా ఆకట్టుకుంది. చివరి 5 ఓవర్లలో ముంబై 62 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ తడబడింది. 11 ఓవర్లలో స్కోరు 70/5గా ఉండడంతో గుజరాత్ పనైపోయినట్లే అనుకున్నారంతా. కానీ ఈ సమయంలో భార్తీ ఫుల్మాలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హేలీ 3 వికెట్లు తీసి మూడే పరుగులు ఇవ్వడంతో గుజరాత్ ఓటమి పాలైంది.