భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన వేగవంతమైన బ్యాటింగ్తో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అతని శైలిని భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. సూర్యవంశీని అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన హర్భజన్, అతడు మైదానంలో చూపే భయంలేని వైఖరి గతంలో ఏ ఆటగాడిలోనూ చూడలేదని అన్నారు. ప్రస్తుత కాలంలో నిర్భయంగా ఆడే ఆటగాళ్లకు దక్కుతున్న ఆదరణే ఈ మార్పుకు కారణమని పేర్కొన్నారు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సూర్యవంశీకి సంబంధించి రాహుల్ ద్రవిడ్తో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని హర్భజన్ పంచుకున్నారు. రాజస్థాన్ హెడ్ కోచ్గా ద్రవిడ్ ఉన్నప్పుడు, “ఇన్నింగ్స్ మొదటి బంతికే ఏం చేస్తావ్?” అని సూర్యవంశీని అడిగారట. దానికి అతడు “బంతి నా పరిధిలో పడితే షాట్ కొడతాను” అని చెప్పి, తన ఐపీఎల్ అరంగేట్రంలో శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతినే సిక్సర్గా మలచి చూపించాడని హర్భజన్ గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం భారత్, జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన గత సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఈ పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన సూర్యవంశీ, గత కొన్ని నెలల్లో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ తనపై నమ్మకంతో ముందుకు సాగుతానని, జట్టు కోసం వంద శాతం శ్రమిస్తానని స్పష్టం చేశాడు. జింబాబ్వే సిరీస్ భారత్ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

