Happy Birthday Dhoni: ఎంఎస్ ధోని.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్. ప్రపంచ క్రికెట్ లో భారత్ తనదైన ముద్ర వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చాడు. కెప్టెన్ గా ఎదిగిన నుండి వరుసగా ఐసీసీ (ICC) ట్రోఫీలను గెలుస్తూ.. క్రికెట్ అంటే భారత్ అనేలా నిరూపించాడు. మ్యాచ్ లో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్న అవన్నీ మనకు కాదు అన్నట్లుగా ఎంతో కూల్ గా వికెట్ల వెనకాల నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చేవాడు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ధోని నేడు (జూలై 7) తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ‘కెప్టెన్ కూల్’గా అభిమానుల మన్ననలు పొందిన ధోనీ జీవితం, కెరీర్ ప్రపంచ క్రీడా చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణాల్లో ఒకటి. రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పనిచేసిన స్థాయి నుంచి భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్గా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు ఎంతో ఆదర్శం.
2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధోనీ.. తన ధనాధన్ బ్యాటింగ్తో త్వరగానే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫినిషర్గా, వ్యూహాత్మక కెప్టెన్గా ఎదిగి భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోనీ నాయకత్వంలో భారత్ 2007లో తొలి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఆ తర్వాత 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ను, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా ధోనీ చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ మొత్తం 538 మ్యాచ్లు ఆడి 17,266 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా 829 డిస్మిసల్స్ నమోదు చేసి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో ధోనీ 350 మ్యాచ్లు ఆడి 50.57 సగటుతో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలతో 10,773 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు అజేయంగా 183 పరుగులు. భారత తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోని ఆరో స్థానంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా ధోనీ 200 మ్యాచ్ల్లో భారత జట్టును నడిపించాడు. ఇందులో 110 విజయాలు సాధించి 55 శాతం విజయాల శాతాన్ని నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 98 మ్యాచ్లు ఆడి 1,617 పరుగులు చేశాడు. కెప్టెన్గా 72 మ్యాచ్ల్లో జట్టును నడిపించి 41 విజయాలు అందించాడు.
టెస్టు క్రికెట్లో ధోనీ 90 మ్యాచ్లు ఆ డి 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 4,876 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 224 పరుగులు. టెస్టు కెప్టెన్గా 60 మ్యాచ్ల్లో భారత్కు నాయకత్వం వహించి 27 విజయాలు సాధించాడు. అతని నాయకత్వంలోనే భారత జట్టు తొలిసారిగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానాన్ని కూడా అందుకుంది. అంతేకాకుండా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో వైట్వాష్ నమోదు చేసిన ఏకైక భారత కెప్టెన్గా కూడా ధోనీ ప్రత్యేక గుర్తింపు పొందాడు. 2010-11, 2012-13 సిరీస్లలో భారత్ ఈ ఘనత సాధించింది.

