భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న ‘జెన్ జీ’ (Gen Z) యువత తమ ఆదాయాన్ని దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారనే దానిపై శాలరీ సే అనే సంస్థ ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని విడుదల చేసింది. దాదాపు 5.2 లక్షల మంది ఉద్యోగుల యూపీఐ (UPI) లావాదేవీలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. జెన్ జీ యువత అనగానే కేవలం విహారయాత్రలు, విలాసవంతమైన జీవనశైలికే ప్రాధాన్యత ఇస్తారనే సాధారణ అభిప్రాయాన్ని ఈ అధ్యయనం పూర్తిస్థాయిలో తిరస్కరిస్తోంది.
వాస్తవానికి ఈ తరం యువత తమ నెలవారీ బడ్జెట్లో 70 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని నిత్య జీవిత అవసరాలు, డిజిటల్ బిల్లులకే కేటాయిస్తున్నారు. ఖర్చులలో అత్యధికంగా 20.1 శాతం వాటా విద్యుత్, ఇతర బిల్లులు, డిజిటల్ సబ్స్క్రిప్షన్లకే వెళ్తోంది. ఆ తర్వాత స్థానంలో నిత్యావసర వస్తువులు (Groceries) 15.7 శాతంతో నిలిచాయి. ఆర్థిక సేవలు లేదా ఈఎంఐలకు 12.2 శాతం, షాపింగ్కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం వంతున ఖర్చు చేస్తున్నారు.
విశేషమేమిటంటే.. జెన్ జీ ఎక్కువగా ఇష్టపడతారని భావించే ప్రయాణాలకు వారి నెలవారీ బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే ఖర్చు అవుతోంది. ప్రయాణించాలనే కోరిక ఉన్నప్పటికీ, దానికి పెద్దపీట వేయకుండా దైనందిన బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వినోద రంగానికి వస్తే జియో హాట్ స్టార్ 12.4 శాతం సబ్స్క్రిప్షన్లతో అగ్రస్థానంలో ఉండగా, నెట్ఫ్లిక్స్ 10.7 శాతం, స్పోటిఫై 5.6 శాతం ఆక్రమించాయి.
వయస్సు పెరిగేకొద్దీ వీరి ఆర్థిక ప్రాధాన్యతలలో మార్పులు వస్తున్నాయి. 18-23 ఏళ్ల వయస్సు గల వారిలో నిత్యావసర ఖర్చులు 50 శాతంగా ఉండగా, 24-29 ఏళ్ల గ్రూప్కు వచ్చేసరికి అది 59 శాతానికి పెరిగింది. అయితే రెండు గ్రూపుల్లోనూ వ్యక్తిగత సరదాల కోసం చేసే ఖర్చు 32 శాతం వద్ద స్థిరంగా ఉండటం గమనార్హం.
యూపీఐ, ఆటోపే (AutoPay) వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి బిల్లు చెల్లింపులు, పెట్టుబడులను వీరు సులభంగా నిర్వహించుకుంటున్నారు. జెన్ జీ డిజిటల్ మాధ్యమాల ద్వారా క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన ఆర్థిక జీవితాన్ని నిర్మించుకుంటున్నారని SalarySe సహ వ్యవస్థాపకుడు పియూష్ బగారియా తెలిపారు. యువత నిత్య అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

