Gautam Gambhir-BCCI: బీసీసీఐతో వాదన.. పంతం నెగ్గించుకున్న గౌతమ్ గంభీర్!

  • బీసీసీఐతో గట్టిగానే వాదన
  • బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌
  • తాత్కలిక కోచ్‌గా సాయిరాజ్ బహుతులే
Gautam Gambhir Bcci

Gautam Gambhir Bcci

Gautam Gambhir argued with BCCI over Team India Bowling Coach: టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా సహాయక సిబ్బంది నియామకంలో తనకు నచ్చిన వారినే ఎంపిక చేసుకున్నాడట. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ విషయంలో బీసీసీఐతో గట్టిగానే వాదించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఐపీఎల్ టోర్నీలో మోర్నీ మోర్కెల్‌ ఆడిన విషయం తెలిసిందే. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ తరఫున ఆడాడు.

దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ మోర్నీ మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ నియామకం ఇంకా పూర్తికాలేదు. త్వరలోనే ఫార్మాలిటీస్ అన్ని పూర్తవుతాయి. శ్రీలంక సిరీస్ అనంతరం అతడు భారత బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. శ్రీలంక సిరీస్‌కు బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులేను బీసీసీఐ ఎంపిక చేసింది.

శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలను చేపట్టనున్నాడు. అసిస్టెంట్ కోచ్‌లుగా భారత మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్‌, నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ టెన్ డస్కాటేలను నియమించారు. బౌలింగ్ కోచ్ నియామకం ఇంకా పూర్తి కాలేదు. దాంతో ఎన్‌సీఏలో బౌలింగ్ కోచ్‌గా ఉన్న సాయిరాజ్ బహుతులేను తాత్కలిక కోచ్‌గా లంకకు వెళ్లానునాడు. బౌలింగ్ కోచ్‌ రేసులో భారత మాజీ పేసర్లు ఆర్ వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీలతో పటు మోర్నీ మోర్కెల్ రేసులో ఉన్నారు. అయితే గంభీర్ మాత్రం మోర్నీనే కావాలని పట్టుబట్టాడట. ఇందుకోసం బీసీసీఐతో వాదనకు కూడా దిగాడట. చివరకు గౌతీ తన పంతం నెగ్గించుకున్నాడని తెలుస్తోంది.