వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండాలని, సెలవులలో వెళ్ళరాదని, ఎలాంటి సెలవులు ఇవ్వబడవని స్పష్టం చేశారు.
శిధిలవస్థలో ఉన్న భవనాలు, కాంపౌండ్ వాల్స్ గుర్తించి తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. కన్స్ట్రక్షన్ సైట్లలో తాత్కాలికంగా పనులు ఆపాలని, లేబరును సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా బిల్డర్లకు సూచించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సిసిపి శ్రీనివాస్ కు మేయర్ ఆదేశించారు. నాళాలు, స్టార్మ్ వాటర్ డ్రైన్ లలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ, పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అవసరమైన చోట పునరావాస కేంద్రాలకు తరలించాలని మేయర్ అధికారులకు సూచించారు.
డిప్యూటీ కమిషనర్లు, ఏ ఎం ఓ హెచ్ లు, ఈ ఈ లు క్షేత్ర పరిధిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా సర్కిల్ ఆఫీసులలో గల కంట్రోల్ రూమ్ ఫోన్ సరిగ్గా పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఆపద సమయంలో జి హెచ్ ఎంసి కంట్రోల్ రూం, ఫోన్ నెంబర్ 040- 21111111 కు గాని ,మై జిహెచ్ఎంసి యాప్ కు ఆన్ లైన్ ద్వారా గాని, డిఅర్ ఎఫ్(హైడ్రా) ఫోన్ నంబర్ 9000113667 లో సంప్రదించవచ్చని మేయర్ సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జోనల్ కమిషనర్లు, సి సి పి పాల్గొన్నారు.
