Free Electricity for Ganesh Mandapams: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథినే ‘గణేష్ చతుర్థి’గా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14వ జరుపుకోనున్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు మరింత వైభవంగా, ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గనుంది. ప్రభుత్వ నిర్ణయంపై గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గణనాథుడి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు మరింత ఉత్సాహం నెలకొననుంది. మండపాల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందడం వల్ల ఉత్సవాల నిర్వహణలో భక్తులకు కొంత ఆర్థిక భారం తగ్గనుంది.

