Vijaysai Reddy New Political Party: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా పనిచేసేలా పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన కుటంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్పై విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు.
ప్రజల గొంతుకను వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. వారి తరపున పోరాడే రాజకీయ వేదికగా కొత్త పార్టీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, విధివిధానాలు, జెండా, అజెండా వంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణపై ఈ నెలలోనే స్పష్టమైన ప్రకటన చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటివరకు తన రాజకీయ భవిష్యత్పై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు.

