VV Lakshmi Narayana: రక్తంతో లేఖలు రాసి.. నీ రక్తం కళ్ల చూస్తామని గతంలో తనను బెదిరించారని గుర్తు చేసుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహించిన విశేష కార్యక్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,028 మంది విద్యార్థులు కలిసి భగవద్గీత 15వ అధ్యాయంలోని 20 శ్లోకాల పారాయణం చేయడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన సేవా కాలంలో ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాలను వెల్లడించారు.
Read Also: Realme Watch 5: 1.97-అంగుళాల AMOLED డిస్ప్లే, 16 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. రియల్మీ వాచ్ 5 రిలీజ్
రక్తంతో లేఖలు వచ్చాయి.. నీ రక్తం కళ్ల చూస్తాం అని బెదిరించారు.. సీబీఐలో పనిచేస్తున్న సమయంలో ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులు ఎదురైన విషయాన్ని లక్ష్మీనారాయణ గుర్తుచేసుకున్నారు. నన్ను భయపెట్టేందుకు.. రక్తంతో లేఖలు రాసి పంపారు.. నీ రక్తం కళ్ల చూస్తాం అని బెదిరించారు.. కానీ నేను భయపడలేదు అని తెలిపారు. అయితే, తనను నిలబెట్టింది భగవద్గీతేనని ఆయన స్పష్టంగా చెప్పారు. భగవద్గీత మీద నమ్మకం ఉండటంతోనే ఆ పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడ్డాను. నేను చేయాల్సిన కర్తవ్యాన్ని ఎలాంటి భయం లేకుండా చేశాను అని లక్ష్మీనారాయణ అన్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
విద్యార్థుల్లో విలువల పెంపు, ధైర్యం, నిర్ణయశక్తి పెరగడానికి భగవద్గీత ఎంతో తోడ్పడుతుందని చెప్పారు లక్ష్మీనారాయణ.. గీతలో ఉన్న సూత్రాలను నేర్చుకుంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరు. పిల్లలు భగవద్గీత చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అని అభిప్రాయపడ్డారు. దేశ మహనీయులు కూడా భగవద్గీతను ఆశ్రయించారని గుర్తుచేశారు. అహింసవాది మహాత్మా గాంధీ, అలాగే బ్రిటిషర్లను ఆయుధాలతో తరిమికొట్టాలని సంకల్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా భగవద్గీతను నమ్ముకున్నారు. అది గీత గొప్పతనాన్ని తెలుపుతుంది అని తెలిపారు. ఇక, భగవద్గీత ప్రపంచానికి మార్గదర్శకమైన గ్రంథం అని, అది మన భారతదేశంలో పుట్టడం మన పుణ్యమని అన్నారు. గీతను చదివిన వారు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు. అదే నా అనుభవం కూడా అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..