మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేడు ఇరాన్లోనికీలకమైన ‘డీశాలినేషన్ ప్లాంట్’పై దాడి చేసింది. ఈ ప్లాంట్ సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలైన ‘జెరూసలేం పోస్ట్’, ‘యెడియట్ అహరోనోత్’ ధృవీకరించాయి. గత కొంతకాలంగా ఇరాన్ చేస్తున్న డ్రోన్ , క్షిపణి దాడులకు యూఏఈ ఇలా నేరుగా సమాధానం చెప్పడం ఇదే మొదటిసారి.
Also Read:Prithvi Shaw Engagement: అకృతి అగర్వాల్ తో పృథ్వీ షా ఎంగేజ్మెంట్.. ఆమె ఎవరంటే?
అసలు ఏం జరిగింది..?
గత నెల 28వ తేదీ నుంచి ఇరాన్ వరుసగా యూఏఈని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న అబుదాబి, దుబాయ్ విమానాశ్రయాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనివల్ల అక్కడి విమాన రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా.. విమానాశ్రయ భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన యూఏఈ.. ఎప్పుడైనా తాము ఎదురుదాడికి దిగుతామని ముందే హెచ్చరించింది. అన్నట్టుగానే.. ఇరాన్ నీటి సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తూ ఈ భారీ దాడికి పాల్పడింది.
ప్రమాదంలో గల్ఫ్ దేశాలు..
కేవలం యూఏఈ మాత్రమే కాదు.. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. ఇరాన్ వైఖరి వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు, చమురు ఎగుమతులు దెబ్బతింటున్నాయని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ దేశాలన్నీ కలిసి ఇరాన్పై ఎదురుదాడికి దిగితే.. అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Also Read:Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
ప్రపంచవ్యాప్త ఆందోళన..
ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. మొత్తం మధ్యప్రాచ్యాన్ని ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం రణరంగాన్ని తలపిస్తోంది. యూఏఈ చేసిన ఈ మొదటి దాడితో.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు భయాందోళనలో ఉన్నాయి.
