NTV Telugu Site icon

Union Budget 2023: బడ్జెట్‌లో యువతకు పెద్దపీట.. నైపుణ్యంపైనే దృష్టి

111

111

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువతకు పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలోనే దేశ యువతకు సాధికారత కల్పించడంతోపాటు వారి స్వప్నాలను సాకారం చేసుకునేందుకు పూర్తి సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో యూత్‌ పవర్‌కు అధిక ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని రూపొందించామని.. తాజాగా వారి స్కిల్ డెవలప్‌మెంట్‌పైనా దృష్టి పెడతామన్నారు. ముఖ్యంగా ఉద్యోగ సృష్టి, వ్యాపార అవకాశాలను పెంపొందించే ఆర్థిక విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు వెల్లడించారు.

పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన 4.0

మూడేళ్లలో లక్షల మంది యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 (PMKVY)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఉద్యోగ ప్రాంగణంలోనే శిక్షణ, పరిశ్రమలతో భాగస్వామ్యం, ఆయా రంగాలకు అవసరమైన కోర్సులను తీసుకురావడం వంటివి ఇందులో ఉంటాయన్నారు. ముఖ్యంగా కోడింగ్‌, కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్‌, మెకాట్రానిక్స్‌, ఐఓటీ (IOT), 3డీ ప్రింటింగ్‌, డ్రోన్లు, సాఫ్ట్‌ స్కిల్స్‌ వంటి కొత్తతరం (Industy 4.0) పరిశ్రమలకు అవసరమైన కోర్సులు ఇందులో ఉంటాయని చెప్పారు.

డిజిటల్‌గా స్కిల్‌ ఇండియా

వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్కిల్‌ ఇండియా కార్యక్రమాన్ని ఇక నుంచి డిజిటల్‌ వేదికగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. డిమాండ్ బేస్‌డ్ స్కిల్స్‌ను అందివ్వడం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలతోపాటు ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం, కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు యువతకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటివి ఇందులో ఉంటాయని తెలిపారు.

47లక్షల మందికి స్టైపెండ్‌

మూడేళ్లలో దేశవ్యాప్తంగా 47లక్షల మంది యువతీయువకులకు ఉపకారవేతనాలు అందించేందుకు గాను నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో ప్రకటించారు. వీరికి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌ కింద నగదు పంపిణీ చేస్తామన్నారు.

దేఖో అప్నా దేశ్‌

దేశంలో టూరిస్ట్‌ సెక్టార్‌ను మరింత డెవలప్‌ చేసేందుకు దేఖో అప్నా దేశ్‌ కార్యక్రమంలో 50 పర్యాటక కేంద్రాలను సమగ్ర, వినూత్న విధానంలో గుర్తించి ప్రమోట్‌ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీటిని భౌతికంగా, వర్చువల్‌గా అనుసంధానం చేయడంతోపాటు టూరిస్టు గైడ్‌లు, పర్యాటకుల భద్రత, ఆ ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేఖో అప్నా దేశ్‌ లక్ష్యాలను సాధించేందుకు గాను యువతలో ఆయా రంగాల్లో నైపుణ్యాలు, వ్యాపార మెలకువలను సంయుక్తంగా పెంపొందిస్తామన్నారు.

Union Budget 2023: ఉపాధి హామీ పథకానికి కోత..ఇళ్లు కొనేవారికి గుడ్‌న్యూస్