Shakambari Devi Temple Flood: ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సిద్ధపీఠ శ్రీ శాకంబరి దేవి ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు రావడంతో భారీ విషాదాన్ని మిగిల్చాయి. శివాలిక్ కొండల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు ఆలయ ప్రాంతంలోకి చేరుకుంది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే జలమయమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోగా, భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం రావడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పెద్ద శబ్దాలతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలను తీసుకుని ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
భారీ వరద ప్రవాహంలో ట్రాక్టర్ ట్రాలీలు, కార్లు, బైక్లు, నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న యంత్రాలు కొట్టుకుపోయాయి. ఆలయ సమీపంలోని ప్రసాదం దుకాణాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేశాయి. పలుచోట్ల వాహనాలు బురదలో కూరుకుపోయి కనిపించాయి. స్థానికులు, భక్తులు కలిసి వాటిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించారు. వరద కారణంగా అనేక దుకాణాలు దెబ్బతినగా, ఆలయ పరిసర ప్రాంతమంతా బురద, చెత్తతో నిండిపోయింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
