ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రైలులోని మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది. రైల్వే డీసీపీ కెపిఎస్ మల్హోత్రా వివరాల ప్రకారం.. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.41 గంటలకు రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. అనంతరం ఐఓ అపోలో ఆసుపత్రి సమీపంలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజ్ ఎక్స్ప్రెస్ రైలులోని మూడు కోచ్లు మంటల్లో చిక్కుకున్నట్లు ఘటనా స్థలంలో కనిపించింది. రైలు ఆగిపోయింది. ప్రయాణికులు ఇతర కోచ్లకు వెళ్లడం, రైలు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం రైల్వేశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
READ MORE: Raghu Raju: ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు..
కాగా.. నిన్న పంజాబ్ లో ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు రైల్వే గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. సిర్హింద్లోని మాధోపూర్ సమీపంలో తెల్లవారుజామున 3:30 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత గూడ్స్ రైలు ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లకు గాయాలయ్యాయి. ఇద్దరు లోకో పైలట్లను ఆసుపత్రిలో చేర్చారు. వీరిని శ్రీ ఫతేగర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి.