కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’కు మరోసారి పిలుపునిచ్చాయి. రైతుల ఆందోళనల్ని ప్రారంభించి 38 రోజులు పూర్తైన సందర్భంగా రైతు నాయకులు చెప్పారు.
Read Also: Suhas : ఏంటయ్యా సుహాస్.. ఏడాదిలో ఏడు సినిమాలా.. రచ్చ రచ్చే..
ఇక, ఆస్తి కలశ్ యాత్ర తర్వాత మార్చి 31 అంబాలాలోని మోహ్రా మండిలో శుభకరన్ సింగ్కు అంకితం చేస్తూ భారీ ఎత్తున సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సభలో ఎస్కేఎం, కేఎంఎం రైతు నాయకులు పాల్గొనబోతున్నారు. బక్సర్ జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై దాడిని ఖండిస్తూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళలు, వృద్ధులను కొట్టిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని రైతు నాయకులు వెల్లడించారు. రేపు శంభు, ఖానౌరీలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు రైతు నాయకులు చెప్పుకొచ్చారు. లడఖ్లోని రైతులు కూడా ఈ పోరాట యాత్రలో పాల్గొంటారని తెలిపారు.
