Fake CBI: పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) అనగానే భయపడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట సిబిఐ దాడులు, ఈడీ దాడులు అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఈ సందర్భాన్ని వాడుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా సీబీఐ అవతారం ఎత్తాడు. విశాఖ పట్నం చిన్నవాల్తేర్ కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు ఫేక్ సీబీఐ అధికారిగా చెలామణీ అవుతూ వివిధ వ్యక్తుల నుంచి డబ్బును స్వీకరించాడు. ఈ నకిలీ సిబిఐ అధికారిని ఢిల్లీలోని తమిళనాడు భవన్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడు తనను తాను సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్గా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడని విచారణలో తేలింది.
Read Also: Mauna Loa Volcano: 38ఏళ్ల తర్వాత బద్ధలైన ప్రపంచంలోని అతి పెద్ద అగ్ని పర్వతం
నిందితుడికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగంలో మంచి పరిచయాలున్నట్లు సమాచారం. సిబిఐ పేరుతో అతను కోట్ల రూపాయల డీల్లు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా సిబిఐ దృష్టి సారించింది. నిందితుని ఇళ్లలో సోదాలు నిర్వహించగా రూ. 21 లక్షల నగదు, బంగారు ఆభరణాలను సీబీఐ సీజ్ చేసింది. తమిళనాడులో ఒక డీల్కు సంబంధించి నకిలీ అధికారి చేసిన సంభాషణ, డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చినవారు సిబిఐకి సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడి ఆచూకీ కోసం సిబిఐ బృందం ఆదివారం రాత్రి ఢిల్లీలోని తమిళనాడు భవన్కు చేరుకుంది. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న మరో వ్యక్తితో నిందితుడు మొబైల్ ద్వారా మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ను అతని మొబైల్ ఫోన్ను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ ఆధారంగా కీలక సమాచారం రాబట్టే ఉన్నారు సీబీఐ అధికారులు. నకిలీ ఐపీఎస్ ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డులు, కారుతో సహా పలు కీలక పత్రాలు, వస్తువులను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
