NTV Telugu Site icon

KCR: కమిషన్లు వేయకూడదన్న విషయం ప్రభుత్వంకు తెలియదా?: కేసీఆర్‌

Cm Kcr Narsapoor

Cm Kcr Narsapoor

KCR Writes Letter on Power Purchase Agreements To Justice L Narasimha Reddy Commission: జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్‌ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటిస్ జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిషన్‌కు 12 పేజీల లేఖ కేసీఆర్‌ రాశారు.

‘రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉంది, ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయింది. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేవి. త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89 శాతం, ఆంధ్రకు 46.1 శాతం కేటాయించి.. ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వలేదు. 2,400 మెగా వాట్ల లోటు ఏర్పడింది. మొత్తంగా ఐదు వేల మెగా వాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది’ అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Also Read: Afghanistan: సూపర్-8 చేరి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్‌!

‘తీవ్ర సంక్షోభంను అధిగమించి కొత్త ప్రాజెక్టులు నిర్ణయించి.. కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేశాం. దాంతో రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగా వాట్లు విద్యుత్తు.. 20,000 మెగా వాట్లకు పైచిలుకు చేరటం మా ప్రభుత్వానికి నిదర్శనం. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం గలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పదేళ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతల్సి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిస్పాక్షి కథ ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై.. ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతుంది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చట్టబద్ధత కలిగిన ఈఆర్‌సీ వెలువరించిన తీర్పులపై విచారణ చేయొద్దన్న ఇంగితం ప్రభుత్వం కోల్పోయింది. ఈఆర్‌సీ వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమీషన్ వేయకూడదు అని ప్రభుత్వానికి సూచించాల్సిన మీరు (జస్టిస్ నరసింహ రెడ్డిని ఉద్దేశించి).. బాధ్యతలు స్వీకరించడం విచారకరం’ అని మాజీ సీఎం కేసీఆర్ లేఖలో రాశారు.