ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారుల కోసం శుభవార్త తీసుకొచ్చింది. పాత, నిరుపయోగంగా ఉన్న పీఎఫ్ ఖాతాల గుర్తింపు, క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఒక కీలక ప్రకటన చేశారు.
ఈ-ప్రాప్తి (E-PRAAPTI) పోర్టల్ ఆవిష్కరణ..
ఉద్యోగులు తమ పాత మరియు ఇన్-ఆపరేటివ్ పీఎఫ్ ఖాతాలను సులభంగా ట్రాక్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి వీలుగా ‘ఈ-ప్రాప్తి’ (E-PRAAPTI) అనే కొత్త వెబ్ పోర్టల్ను త్వరలో ప్రారంభించనున్నారు. దీని పూర్తి పేరు ‘ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్-బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇన్ఆపరేటివ్ అకౌంట్స్’. 2014 కంటే ముందు యూఏఎన్ (UAN) లేని ఖాతాలను కలిగిన వారు కూడా ఆధార్ ధృవీకరణ ద్వారా తమ పాత ఖాతాలను గుర్తించి, ప్రస్తుత యూఏఎన్తో అనుసంధానం చేసుకోవచ్చు. తొలి దశలో ఇది మెంబర్ ఐడీ ఆధారంగా పనిచేస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్వో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. ఇందులో సుమారు 5.51 కోట్ల క్లెయిమ్లు అడ్వాన్స్ లేదా పాక్షిక విత్డ్రాయల్స్ కావడం గమనార్హం. 71.11 శాతం అడ్వాన్స్ క్లెయిమ్లు కేవలం 3 రోజుల్లోనే ఆటో మోడ్ ద్వారా పూర్తయ్యాయి. 6.68 కోట్ల మంది సభ్యులు చెక్కు ఇమేజ్ అప్లోడ్ చేసే అవసరం లేకుండానే క్లెయిమ్లు దాఖలు చేశారు. 1.59 కోట్ల మంది సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలను యజమాని అనుమతి లేకుండానే సీడింగ్ చేసుకోగలిగారు.
ఏప్రిల్ 2026లో 61.03 లక్షల క్లెయిమ్లు పరిష్కారమవగా, అందులో 98.70 శాతం క్లెయిమ్లు 20 రోజుల కంటే తక్కువ సమయంలోనే పూర్తయ్యాయి. ఈ సంస్కరణల ద్వారా మన్యువల్ జోక్యం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాత ఐడీలు గుర్తులేని వారు కూడా ఈ సేవలను పొందేలా పోర్టల్ను విస్తరించనున్నారు.
