Varanasi Update: భాషా సరిహద్దులను బద్ధలు కొట్టిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలుసిందే. పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిన తెలుగు దర్శకుడు జక్కన్న. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోఈ మూవీ మేకింగ్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జక్కన్న మాట్లాడుతూ.. ‘వారణాసి’ చిత్రం మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తాయని వెల్లడించారు.
‘మా దగ్గరున్న థియేటర్లన్నీ ‘సినిమా స్కోప్’ ఫార్మాట్లో ఉంటాయి. ఈ మూవీని ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీయాలనుకున్నప్పుడు నిజంగా ఇది మాకొక సవాల్ అనిపించింది. దీంతో సినిమాను ఏ ఫార్మాట్లో షూట్ చేయాలన్న దానిపై చిత్రబృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరకు మొత్తం యూనిట్ అంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ‘వారణాసి’ సినిమా మెజారిటీ భాగం 1.90:1 (సినిమా స్కోప్) లోనే ఉంటుంది. కానీ, కథలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలను మాత్రం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్ (1.43:1) లో వెండితెరపై ఆవిష్కరించనున్నాము’ అని వెల్లడించారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రెండు ఫార్మాట్లను కలిపేసి ఆ ప్రత్యేకతను పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఐమ్యాక్స్ షాట్స్ను ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తించాలి. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ నిండుగా ట్రూ ఐమ్యాక్స్ అనుభూతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఎంత కష్టమైనా సరే, మేము చేయగలం’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతుంది.
READ ALSO: T20 World Cup 2026: ప్రపంచ కప్లో నవ్వుల పాలు కాకుండా బయటపడ్డ పాక్..
