E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?

E20 Petrol

E20 Petrol

E20 Petrol: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్‌లోని కొన్ని భాగాలపై ప్రభావం పడుతోందని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి ప్రత్యేక ధర నిర్ణయించాలని, సాధారణ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్‌పై తన వైఖరిని స్పష్టం చేసింది.

ప్రభుత్వం ప్రకారం, E20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం పెట్రోల్‌ను చౌకగా చేయడం కాదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యమని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

E20 ఇంధనంలో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ఈ ఇథనాల్‌ను దేశీయంగా చెరకు, మొక్కజొన్నతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. పెట్రోల్‌లో కొంత భాగాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్‌తో భర్తీ చేయడం ద్వారా విదేశాల నుంచి ముడి చమురు దిగుమతుల అవసరం తగ్గుతుందని ప్రభుత్వం వివరించింది. దీంతో దిగుమతి వ్యయం తగ్గడమే కాకుండా, దేశీయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతుందని తెలిపింది.

భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడుతోంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచడం ద్వారా ఈ ఆధారపడటాన్ని తగ్గించి, భవిష్యత్తులో చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కొంత మేర నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

2022 నుంచి 2026 మధ్య కాలంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో పెట్రోల్ ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో భారత్‌లో ఇంధన ధరలు కేవలం 5.6 శాతం మాత్రమే పెరిగాయని పేర్కొంది. అలాగే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (EBP) ద్వారా సుమారు 31 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులను భర్తీ చేయడంతో పాటు, రూ.1.90 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసినట్లు వెల్లడించింది.

ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు అదనపు మార్కెట్ లభించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొంది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇంధన వినియోగం పెరగడం వల్ల విదేశీ మారకద్రవ్య వ్యయం కూడా తగ్గుతుందని వివరించింది. మొత్తంగా, E20 ఇంధనం లక్ష్యం పెట్రోల్ ధరను తగ్గించడం కాదని, భారతదేశాన్ని ఇంధన పరంగా మరింత స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, భవిష్యత్తులో అంతర్జాతీయ చమురు సంక్షోభాలు లేదా ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.