AIIMS-Delhi: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి కొత్త డైరెక్టర్గా డాక్టర్ ఎం శ్రీనివాస్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ శుక్రవారం నియమించింది. దిల్లీ ఎయిమ్స్ ప్రస్తుత డైరెక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ డీన్ శ్రీనివాస్ను నియమించారు. సెప్టెంబరు 23 నాటి అధికారిక ఉత్తర్వుల ప్రకారం, శ్రీనివాస్ను ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ స్థానంలో సేవలందించనున్నారు.
Uttarakhand: రిసార్ట్లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
డాక్టర్ గులేరియా మార్చి 28, 2017న డైరెక్టర్గా చేరారు. నేటితో ఆయన పదవీకాలంలో ముగియనుండడంతో శ్రీనివాస్ను ఈ స్థానానికి ఎంపిక చేశారు. శనివారం శ్రీనివాస్ ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. . తొలుత ఈ పదవికి పలువురి పేర్లు వినిపించినా.. ఇటీవల డాక్టర్ శ్రీనివాస్ పేరును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక/శోధన కమిటీ సిఫార్సు చేసింది. ఆయనతో పాటు తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ బిహారీ పేరునూ కమిటీ ప్రతిపాదించింది. మార్చిలో, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ ప్రమోద్ గార్గ్, ఎండోక్రినాలజీ విభాగం అధిపతి డాక్టర్ నిఖిల్ టాండన్, ఎయిమ్స్ ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రాతో సహా ముగ్గురు వైద్యుల పేర్లు వచ్చాయి. చివరికి డాక్టర్ శ్రీనివాస్ను నియమిస్తూ కేంద్ర నియామక, శిక్షణ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
