కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నదన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే, ఎవరు నమ్మరు అని విమర్శించారు. ఏ రాజకీయం లబ్ది కోసం కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు? అని డీకే అరుణ ఎద్దేవా చేశారు.
ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ… ‘ఏం రాజకీయం కోసం కల్వకుంట్ల కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉంది. ఇప్పుడొచ్చి కవితమ్మ కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే.. ఎవరు నమ్మరు. కాళేశ్వరం విషయంలో కమిటీ, నివేదికలంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ కావాలనే తాత్సరం చేసింది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని తప్పించాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఈ కేసును సీబీఐకి అప్పగించొచ్చు కదా. కమిటీలు, విచారణలు, నివేదికలు అన్నారు. ఆ నివేదికలో ఏముందో ఎందుకు బయట పెట్టలేదు?. చివరకు అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ పెట్టి సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు’ అని చెప్పారు.
Also Read: Mitchell Starc: మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం!
‘కాళేశ్వరం విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది కాంగ్రెస్ తీరు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ముందు నుంచి కోరుతున్నది. ఎదో చేద్దాం అనుకున్నారు, ఏమి చేయలేరని తేలిపోయింది.. ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఇప్పటికైనా సీబీఐ విచారణకు కాంగ్రెస్ సహకరించాలి. కవిత కూడా కేసీఆర్ ఫ్యామిలే కదా. కాళేశ్వరం డిజైన్ చేసిందే నేను అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. పార్టీ నేతలు కూడా అదే చెప్పారు. ఇప్పుడు కేసు విచారణకు వస్తే.. కేసీఆర్కు ఏ పాపం తెలియదు అంటే నమ్మేస్తారా?. కవిత మాటలు ఎవ్వరు నమ్మరు’ అని ఎంపీ డీకే అరుణ చెప్పుకొచ్చారు.
