రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీస్తోంది. అయితే ఈ సినిమా ఓవర్సీస్ లోను సరికొత్త సంచలనాలు నమోదు చేస్తుంది. కేవలం 13 రోజుల్లోనే ఓవర్సీస్ మార్కెట్లో కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విదేశాల్లో ఇప్పటివరకు 38.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 360 కోట్లు) గ్రాస్ను వసూలు చేసింది.
ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చిత్రం గల్ఫ్ దేశాలలో విడుదల కాలేదు. సాధారణంగా భారతీయ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ అనేది బిగ్ మార్కెట్. అక్కడ ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లు రాబడతాయి. కానీ ధురంధర్ గల్ఫ్ కంట్రీస్ లో రిలీజ్ కానప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం అనే చెప్పాలి. అంతేకాకుండా చైనా వంటి ఈస్ట్ ఆసియా దేశాల్లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓవర్సీస్ గ్రాస్ సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా బాహుబలి-2 రికార్డులను సైతం అధిగమించి ముందుకు వెళ్తోంది. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కూడా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలుస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పటికీ థియేటర్ల వద్ద జనం రద్దీ ఏమాత్రం తగ్గకపోవడం ఈ సినిమాకున్న క్రేజ్కు నిదర్శనం. రణవీర్ సింగ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్గా నిలవడమే కాకుండా త్వరలోనే రూ. 2000 కోట్ల మార్క్ ను కూడా అందుకునెలా ఉంది.
