Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Dharmendra Pradhan Education Qualification: దేశంలో నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు మరింత ముమ్మరమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్న తర్వాతే దేనిపైనైనా చర్చ జరుగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో వివాదంలో చిక్కుకున్న విద్యాశాఖ మంత్రి విద్యా అర్హతలు, ఆయన నేపథ్యంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చాలా మంది యువత గూగుల్‌లో ప్రస్తుతం దేశ విద్యాశాఖ మంత్రి విద్యా్ర్హతల గురించి సెర్చ్ చేస్తున్నారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువుకున్నారు? ఆయన నేపథ్యంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధర్మేంద్ర ప్రధాన్ విద్యాభ్యాసానికి వస్తే, ఆయన ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ప్రముఖ ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం)లో 1990లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.) విద్యనభ్యసించారు. ఇక, 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే చురుకైన రాజకీయ అభిరుచి కలిగిన ఆయన, 1983లో తాల్చేర్ కాలేజీలో హయ్యర్ సెకండరీ చదువుతున్న సమయంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985లో తాల్చేర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, తదనంతరం విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన 1993లో ఏబీవీపీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, 1995లో జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 డిసెంబర్ 9న వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అదే సంవత్సరంలో ఆయన అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2024 జూన్ నుంచి దేశ విద్యాశాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.

ఇక, ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఆయన వద్ద సుమారు రూ.7 కోట్ల (రూ.6,92,19,190) నికర ఆస్తులు ఉన్నాయి. దీనితో పాటు దాదాపు రూ.53 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. ఆయన పేరిట ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.20.5 లక్షల విలువైన వ్యవసాయేతర భూమితో పాటు, ఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్ అహింసా ఖండ్‌లో రూ.2 కోట్ల విలువైన ఒక ప్లాట్ కూడా ఉంది.