Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..

Padikkal

Padikkal

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌ను తన అంతిమ లక్ష్యంగా పేర్కొన్నారు. సాంకేతికంగా కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్లనే శ్రీలంకతో గాలేలో జరుగుతున్న మొదటి టెస్టులో రాణించగలిగానని తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన పడిక్కల్.. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఆయన అద్భుత బ్యాటింగ్ వల్ల భారత్ ఈ మ్యాచ్‌లో విజయం వైపు అడుగులు వేసింది. రోజు ఆట ముగిసిన అనంతరం పడిక్కల్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తానని, దానికి తగ్గట్టుగానే తన టెక్నిక్స్ ను రూపొందించుకున్నానని వివరించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రెడ్ బాల్ క్రికెట్‌కు మారడం అంత సులభం కాదని పడిక్కల్ అభిప్రాయపడ్డారు. వైట్ బాల్ క్రికెట్‌లో కాస్త స్వేచ్ఛగా షాట్లు ఆడతానని, అదే రెడ్ బాల్ క్రికెట్‌కి వచ్చేసరికి చేతులను శరీరానికి దగ్గరగా ఉంచుకుంటూ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతిక మార్పులతో పాటు మానసిక దృక్పథంలో కూడా మార్పులు రావడం ఎంతో ముఖ్యమని చెప్పారు. నిలకడగా మ్యాచ్‌లు మారుతున్నప్పటికీ ఆ శైలికి త్వరగా అలవాటు పడేలా తన ఆటను మెరుగుపరుచుకున్నానని పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ గాయపడటంతో పడిక్కల్‌కు ఆడే అవకాశం లభించింది. మూడో స్థానంలో తన భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం లేదని, మైదానంలోకి దిగిన ప్రతిసారి పరుగులు చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మనం సరిగ్గా రాణించకపోతే మన స్థానంపై నిరంతరం ప్రశ్నలు వస్తూనే ఉంటాయని, అందువల్ల తనకు లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు. నిలకడగా పరుగులు సాధిస్తే జట్టులో ఎక్కువ కాలం కొనసాగవచ్చనే నమ్మకం తనకు ఉందని పడిక్కల్ ధీమా వ్యక్తం చేశారు.