ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఒక భారీ నకిలీ టూత్పేస్ట్ తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. నమ్మకమైన బ్రాండ్గా పేరున్న ‘సెన్సోడైన్’ (Sensodyne) పేరుతో కల్తీ పేస్ట్ను తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించి అధికారులు దానిని సీజ్ చేశారు.
ఢిల్లీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఒక రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న ఈ నకిలీ తయారీ యూనిట్పై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలైన సెన్సోడైన్ ప్యాకేజింగ్ను పోలి ఉండేలా అత్యంత నైపుణ్యంతో ఈ నకిలీ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల దాడిలో భారీ మొత్తంలో కల్తీ సరుకు దొరికింది. ఇందులో ప్రధానంగా.. 3,000 కంటే ఎక్కువ నింపిన నకిలీ సెన్సోడైన్ ట్యూబ్లు, 10,000 ఖాళీ ట్యూబ్లు (ప్యాకింగ్కు సిద్ధంగా ఉన్నవి). సుమారు 130 కిలోల విడి పేస్ట్, ప్యాకేజింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Story Board: ఎన్నికల సమయంలో ఉచితాలు బాధ్యతారాహిత్యం..
ఈ అక్రమ వ్యాపారానికి సూత్రధారి, ఫ్యాక్టరీ యజమాని అయిన హరి మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో నాసిరకం రసాయనాలను ఉపయోగించి ఈ పేస్ట్ను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ నకిలీ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లతో పాటు చిన్న చిన్న కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇలాంటి నకిలీ టూత్పేస్ట్లను ఉపయోగించడం వల్ల చిగుళ్ల వ్యాధులు, పంటి ఎనామిల్ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజింగ్, బార్ కోడ్ మరియు ధరను జాగ్రత్తగా గమనించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.