Dawood Ibrahim: దావూద్ పూర్వీకుల ఆస్తి వేలం.. చిన్న ప్లాట్‌ రూ.2 కోట్లకు విక్రయం

Dawood Ibrahim

Dawood Ibrahim

Dawood Ibrahim: చాలా కాలం తర్వాత ఈమధ్య అండర్ వరల్డ్ డాన్ ‘దావూద్ ఇబ్రహీం’ పేరు సోషల్ మీడియా లో తెగ వినిపిసుంది. ఆయనపై పాకిస్తాన్ లో విషప్రయోగం జరిగినట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా లో ఉన్న దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన పూర్వీకుల ప్లాట్‌ను రూ.15,440 రిజర్వ్‌ ధరతో శుక్రవారం వేలంలో రూ.2 కోట్లకు విక్రయించారు. పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నాలుగు పూర్వీకుల ఆస్తులలో ఇది ఒకటి. దీనిని స్మగ్లర్స్‌ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) వేలం వేసింది.

Read Also: Pakistan Election: పాకిస్థాన్‌లో ఎన్నికలు వాయిదా.. తీర్మానాన్ని ఆమోదించిన సెనేట్

దావూద్ ఇబ్రహీం కస్కర్ పూర్వీకుల గ్రామమైన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో వ్యవసాయ ప్లాట్లు, ఆస్తులు ఉన్నాయి. రూ.1.56 లక్షలుగా నిర్ణయించిన మరో ఆస్తిని రూ.3.28 లక్షలకు విక్రయించారు. మొత్తం నాలుగు ఆస్తుల ధరను రూ.19.2 లక్షలుగా నిర్ణయించారు. రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీ పేరిట నాలుగు వ్యవసాయ ఆస్తులు ఉన్నాయట. వీటిని SAFEMA అధికారులు వేలం వేస్తున్నారు. దీనికి ముందు కూడా దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు సంబంధించిన 11 ఆస్తులను SAFEMA అధికారులు వేలం వేశారు.

2017లో, హోటల్ రౌనక్ అఫ్రోజ్, షబ్నమ్ గెస్ట్ హౌస్, భేండీ బజార్ సమీపంలోని దామర్‌వాలా భవనంలోని ఆరు గదులతో సహా దావూద్ ఆస్తులను SAFEMA విజయవంతంగా వేలం వేసింది. ఆ వేలంలో రూ.11 కోట్లు పలికాయి. 2020లో, దావూద్‌కు చెందిన మరో ఆరు ఆస్తులను అథారిటీ వేలం వేసింది. ఆ వేలంలో మొత్తం రూ. 22.79 లక్షలు వచ్చాయి. 1993లో 250 మందికి పైగా మరణించిన, వందలాది మంది గాయపడిన బాంబే వరుస పేలుళ్లకు దావూద్ సూత్రధారి. దావూద్‌ గ్లోబల్ టెర్రరిస్ట్, భారత మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.