Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

Danish Kaneria

Danish Kaneria

Danish Kaneria: భారత్‌లో జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న విద్యార్థుల నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా విద్యార్థులు చేపడుతున్న ఈ ఆందోళనపై స్పందిస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ నిరసనను ఒక ‘సర్కస్’, ‘తమాషా’ అని అభివర్ణించాడు. భారత్‌లో జరిగే ప్రతీ నిరసన ప్రదర్శనలోనూ శ్రీరాముడిని, భారతావనిని, ప్రధాని మోదీని, ప్రధాని మోదీ దివంగత తల్లిని, బ్రాహ్మణులను అలాగే హిందూత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక రోజు భారత్‌లో నేపాల్ లాంటి పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ప్రతిపక్షం జీవిస్తున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు.. అమెరికాతో ఇంకా ఒక్క వాణిజ్య ఒప్పందం కూడా కుదరలేదు, కానీ కొంతమంది రైతులు ఇప్పటికే ఢిల్లీని దిగ్బంధించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఇది ఒక సర్కస్‌గా మారుతోందంటూ ట్వీట్ చేశాడు. చర్చలు, పరిష్కారాలు లేకుండా కేవలం అరాచకం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నాడు. అసలు విషయాలు తెలుసుకోకుండానే విపక్షాలు, కొందరు ప్రజలు నిరసనలకు దిగడం వల్ల దేశ పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు.

మరోవైపు.. పాకిస్థానీ అయి ఉండి భారతీయ విద్యార్థుల ఆందోళనను అవహేళన చేసేలా ట్వీట్ చేయడంతో భారత నెటిజన్లు కనేరియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కేవలం ఇద్దరు హిందూ క్రికెటర్లలో కనేరియా ఒకరు. 2000 నుంచి 2010 మధ్య 61 టెస్టుల్లో 261 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా నిలిచినా, 2012లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం విధించింది. తాను పాకిస్థాన్ జట్టులో ఉన్నప్పుడు హిందువునైనందున తీవ్ర వివక్ష ఎదుర్కొన్నానని, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేయడమే కాకుండా కనీసం తనతో కలసి భోజనం కూడా చేసేవాడు కాదని కనేరియా గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.