దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) సాధిస్తున్న అపారమైన విజయానికి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తో ఉన్న బలమైన అనుబంధమే ప్రధాన కారణమని ఆ దేశ దిగ్గజ మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డారు. ఐదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో ఆయన లీగ్ విజయ రహస్యాలను పంచుకున్నారు.
కరోనా మహమ్మారి తర్వాత దక్షిణాఫ్రికాలో స్థానిక క్రీడలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్టెయిన్ గుర్తుచేశారు. ఆ క్లిష్ట సమయంలో ఎస్ఏ20 కమిషనర్ గ్రేమ్ స్మిత్, లీగ్ యాజమాన్యం దేశానికి క్రికెట్ను తిరిగి తెచ్చిచ్చారని కొనియాడారు. “క్రికెట్ కోసం ఆకలితో ఉన్న అభిమానులకు ఈ లీగ్ సరికొత్త ఊపిరి పోసింది. ప్రేక్షకులు మైదానాలకు పోటెత్తుతూ సీజన్ తర్వాత సీజన్ తమ జట్లకు అండగా నిలుస్తున్నారు” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
భారత్తో విడదీయరాని బంధం..
ఎస్ఏ20 విజయవంతం కావడానికి భారతీయ ఫ్రాంచైజీల యాజమాన్యం (ఉదాహరణకు సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఎమ్ఐ కేప్ టౌన్ వంటివి) కీలక పాత్ర పోషించిందని స్టెయిన్ పేర్కొన్నారు. అలాగే, ఐపీఎల్ షెడ్యూల్కు ఎలాంటి అంతరాయం కలగకుండా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ప్రణాళికలు రచిస్తోందని, దీనివల్ల సఫారీ మేటి ఆటగాళ్లు పూర్తి టోర్నమెంట్కు అందుబాటులో ఉంటారని చెప్పారు.
భారత్లో మ్యాచ్లా? అవసరం లేదు
బిగ్ బాష్ లీగ్ (BBL 2026-27) సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ చెన్నైలో జరగనున్న నేపథ్యంలో.. ఎస్ఏ20 మ్యాచ్లను కూడా భారత్లో నిర్వహించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు స్టెయిన్ ఘాటుగా సమాధానమిచ్చారు. “భారతీయ అభిమానులకు ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ అయిన ఐపీఎల్ ఉంది. కాబట్టి ఎస్ఏ20 మ్యాచ్లను భారత్కు తరలించి, దక్షిణాఫ్రికా అభిమానులను దూరం చేయడం సరికాదు. బిగ్ బాష్ లీగ్ క్రేజ్ తగ్గుతుండటం వల్లే వారు భారత్లో మ్యాచ్లు పెట్టి పునరుజ్జీవనం పొందాలని చూస్తుండొచ్చు. కానీ మా లీగ్ అద్భుతంగా సాగుతోంది. బాగున్న దాన్ని అనవసరంగా మార్చాల్సిన అవసరం లేదు అని డేల్ స్టెయిన్ స్పష్టం చేశారు.

