రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధుల నుంచి ఎండోమెంట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలన్నారు పురంధేశ్వరి. ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.
పురంధేశ్వరి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తిపై రూ. 2 లక్షల భారం ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని, దాని వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. విశాఖ కేజీహెచ్లో 534 మంది మద్యం తాగి అనారోగ్యం పాలయ్యారని, వారిలో 200 మంది చనిపోయేలా ఉన్నారని పురంధేశ్వరి తెలిపారు.
