Cyclone Mandous: తీరం దాటిన మాండూస్‌ తుఫాన్‌.. ఆ రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్

Cyclone Mandous

Cyclone Mandous

Cyclone Mandous: మాండూస్‌ తుఫాన్‌ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్‌ తీరం దాటింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. మహాబలిపురంకు వాయవ్యంగా 70కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర తమిళనాడుపై కొనసాగుతూ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. తీరం వెంబడి 55కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. నేడు తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో చలిగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది.

దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాను తీరం దాటడంతో రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్నారు. మాండూస్ తుఫాను బలహీనపడే వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ప్రజలను అభ్యర్థించింది.మూడు గంటల్లో దాదాపు 65 చెట్లు నేలకూలాయని, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు మోటార్‌ పంపులను వినియోగిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

ఇదిలావుండగా, మాండూస్ తుఫాను దృష్ట్యా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని స్టాలిన్ అన్నారు. తుఫాను తీవ్రత మధ్య తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రమైన చెపాక్‌ను సందర్శించి పరిశీలించారు. జిల్లాల వారీగా కూడా తుఫాను పర్యవేక్షణను మోహరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పాటించాలని, ప్రభుత్వంతో కార్పొరేట్‌లు నడుచుకోవాలని స్టాలిన్ కోరారు. కాగా, సిరుమలై, కొడైకెనాల్‌లోని పాఠశాలలు, కళాశాలలకు శనివారం దిండిగల్‌ కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డాప్లర్ వెదర్ రాడార్ కారైకల్, చెన్నై తుఫానును పర్యవేక్షిస్తున్నాయి.