IPL 2025: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ రిటైన్.. సీఎస్‌కే సీఈవో ఏమన్నాడంటే?

  • అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ధోనీ
  • మహీని కలవనున్న సీఎస్‌కే సీఈవో
  • అక్టోబర్‌ 31 తుది గడువు
The Goat Ms Dhoni

The Goat Ms Dhoni

ఐపీఎల్‌ 2025లో ‘అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌’ రూల్‌ను మరలా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లీగ్‌ మొదటి నుంచి ఈ రూల్‌ భాగంగా ఉన్నా.. ఏ ప్రాంచైజీ ఉపయోగించలేదు. దాంతో 2021లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఏ భారత ఆటగాడైనా అయిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోతే లేదా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగి ఉండకపోతే.. అతడిని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా పరిగణిస్తారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది.

అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ నిబంధన ప్రకారం.. ఎంఎస్‌ ధోనీని చెన్నై సూపర్‌ కింగ్స్ రూ.4 కోట్లకు రిటైన్‌ చేసుకుంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికైతే ధోనీ విషయంలో సీఎస్‌కే ఎలాంటి చర్చలు జరపలేదని ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ‘అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ గురించి మాకు స్పష్టత లేదు. ఈ నిబంధనను ఎంఎస్ ధోనీ కోసం కూడా మేం ఉపయోగించకపోవచ్చు. దీని గురించి ఇంకా మహీతో చర్చించలేదు. ధోనీ అమెరికాలో ఉన్నాడు. త్వరలోనే నేను యూస్ వెళుతున్నా. ధోనీతో చర్చలు జరిపాక క్లారిటీ రానుంది. మహీ ఐపీఎల్‌ 2025లో ఆడతానని ఆశిస్తున్నాం. తుది నిర్ణయం మాత్రం అతడిదే’ అని సీఎస్‌కే సీఈవో చెప్పారు.

Also Read: Viral Video: ‘సూపర్ ఉమెన్’.. ముగ్గురు దొంగలను ఒంటిచేత్తో అడ్డుకుంది! వీడియో వైరల్

ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు సంబంధించి నిబంధనలను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాలి. ఫ్రాంఛైజీలు రిటైన్‌ జాబితాను అక్టోబర్‌ 31 లోపు సమర్పించాలి. నవంబరులో ఐపీఎల్‌ 2025 మెగా వేలం జరగనుంది.