Crude Oil and Gas Prices Drop: అంతర్జాతీయ మార్కెట్లో చమురు, సహజ వాయువు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి.. హార్మూజ్ జలసంధి విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో మార్కెట్లలో భారీ మార్పులు నమోదయ్యాయి. ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ అమల్లో ఉన్నంతకాలం హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలకు అనుమతి ఇస్తామని ప్రకటించడంతో చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ఇప్పటివరకు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా ఉన్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా 86 డాలర్ల వరకు దిగివచ్చాయి. అనంతరం కొంత కోలుకుని 90 డాలర్లకు చేరుకున్నాయి.
చమురు ధరల్లో భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 10.48 శాతం తగ్గి 88.97 డాలర్లకు చేరింది. సెషన్ మధ్యలో ఇది 86.09 డాలర్ల కనిష్ట స్థాయిని తాకింది. అలాగే WTI క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 12.12 శాతం పడిపోయి 83.21 డాలర్లకు చేరింది. ఇది ఇటీవల కాలంలో ఒక్కరోజులో నమోదైన అతిపెద్ద పతనంగా చెబుతున్నారు.
గ్యాస్ ధరలు కూడా తగ్గుముఖం
చమురు ధరలతో పాటు సహజ వాయువు ధరలు కూడా తగ్గాయి. ఎల్ఎన్జీ ధరలు 2.624 డాలర్ల వరకు దిగివచ్చాయి. అయితే తర్వాత కొంత పెరిగి 2.674 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మొత్తంగా గ్యాస్ మార్కెట్లో కూడా ఒత్తిడి కనిపించింది.
హార్మూజ్ జలసంధిపై మళ్లీ అనిశ్చితి
ఇక శనివారం ఉదయం Mohammad Bagher Ghalibaf హార్మూజ్ జలసంధిని అమెరికా ఆదేశాల ప్రకారం కాకుండా, ఇరాన్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమెరికా ఆంక్షలు కొనసాగితే జలసంధిని మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన విమర్శించారు. ఈ తాజా పరిణామాలతో సోమవారం నుంచి చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లపై ప్రభావం
హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందనే వార్తలతో అమెరికా మార్కెట్లు 2 శాతం పైగా లాభపడ్డాయి. అదే సమయంలో భారత మార్కెట్ సూచిక అయిన గిఫ్ట్ నిఫ్టీ కూడా బలమైన సంకేతాలు ఇస్తోంది. సోమవారం భారత మార్కెట్లో సుమారు 300 పాయింట్ల గ్యాప్-అప్తో ప్రారంభమయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధరలు తగ్గితే భారత్ వంటి దిగుమతి దేశాలకు ఊరట లభిస్తుంది. ఇంధన ధరలపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
