Jubilee Hills Robbery Case: ఇంట్లో పనిమనుషులుగా నటిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ భరతం పట్టారు పోలీసులు. ఇటీవల నందగిరి హిల్స్లో ఓ ఇంట్లో చోరీ చేసిన గ్యాంగ్ను నేపాల్కు పారిపోతుండగా పట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి మరీ ఆ ముఠా ఆటకట్టించారు పోలీసులు. జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్లో ఓ వ్యాపారి నివాసంలో ఫిబ్రవరి 5న చోరీ జరిగింది. ఇంట్లో పని చేస్తున్న నేపాలీ గ్యాంగ్ పనేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేశారు. అంతే కాదు అందులోని ఇద్దరు నిందితుల్ని నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. నేపాలీలకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ముంబైలో పట్టుకున్నారు. బంగారం వెండి ఆభరణాలను తీసుకొని పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొన్ని రోజుల ముందుగానే ఇంట్లో దోపిడీ చేయాలని నేపాలీలు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే నందగిరి హిల్స్లో ఉంటున్న వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో ఉంటున్న నేపాలీలతో పరిచయం పెంచుకున్నారు. తమకు తాము నేపాల్ నుంచి వచ్చామని పరిచయం పెంచుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే గత నెల రోజుల నుంచి ఇద్దరు నేపాలీలు ఇంట్లో పని చేస్తున్నారు. యజమానికి చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. ఐతే కొత్తగా వచ్చిన నేపాలీలు.. యజమాని ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారు అనే విషయంపై రెక్కీ నిర్వహించారు.
ఫిబ్రవరి 5న యజమాని రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో చోరీ చేశారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడైన భూపేందర్ సాహా అలియాస్ భువన్ ముఠా పక్కా ప్రణాళికతో లక్షలాది రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను చోరీ చేసి పరారీ అయ్యారు. యజమానులు ఫంక్షన్ కోసం బయటకు వెళ్లి వస్తారనే ముందస్తు సమాచారంతో భూపేందర్ తన స్నేహితులను పిలిపించి జన్మదినం పేరుతో ఇంట్లోని వాచ్మెన్తో సహా ముగ్గురికి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చినట్లు తేలింది. అయితే సీసీ కెమెరాలకు చిక్కకుండా నందగిరి హిల్స్ నుంచి ప్రధాన రోడ్లపై కాకుండా అంతర్గత రోడ్లపై నుంచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భూపేందర్ను పనిలో కుదిర్చిన మదన్ అనే ఏజెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిది నేపాల్లోని దాయ్లేక్ మున్సిపాల్టీలోని అతిభిషన్ అనే ప్రాంతంగా గుర్తించారు. చోరీ చేసిన అనంతరం బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో కాపు కాశారు. కోల్కతా, గోరఖ్పూర్తో పాటు మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో తెలిసినవారి ఇండ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. చోరీ చేసిన తర్వాత నేపాలీలు ఇద్దరు నేరుగా వివిధ మార్గాల ద్వారా ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి వాళ్లకు ఆశ్రయం కల్పించాడు. వాళ్లు పారిపోతున్న సమయంలో సెల్ ఫోన్ జారీ ఇంటి వద్దనే పడిపోయింది. ఒకరోజు పాటు ముంబైలో షెల్టర్ తీసుకున్న తర్వాత ట్రైన్ మార్గంలో బీహార్ సమీపంలోని నేపాల్ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే అప్పటికే హైదరాబాద్ పోలీసులు అక్కడ మాటు వేశారు. ఇండియా నేపాల్ సరిహద్దు సంబంధించి నాలుగు మార్గాల గుండా వెళ్లి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు మాటు వేసి అక్కడ వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు ప్లాన్లో భాగంగానే వాళ్లు ఆ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేసి వివిధ మార్గాల ద్వారా నేపాల్ కి చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టిందని పోలీసులు చెప్తున్నారు.
READ ALSO: Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
